పేజీలు

23, ఆగస్టు 2011, మంగళవారం

డల్లాసులో మేడసాని మోహన్ శతావధానము


ఈ వారాంతము (అగష్టు 21వ తేది) డల్లాసులోని డి.ఎప్.డబ్లు  హిందూ దేవాలయములో అపూర్వ పంచసహసా్రవధాని శ్రీ మేడసాని మోహన్ గారి శతావధానము వైభవోపేతముగ జరిగినది. అమెరికాలో రెండోసారి మాత్రమే జరిగిన ఈ చారిత్రాత్మక శతావధానము ఒక విన్నూత్నమైన విధముగ సాగినది. సాధారణముగ మూడు రోజులు సాగవలసిన కార్యక్రమాన్ని ఏ మాత్రము ప్రమాణాలు తగ్గకుండా కేవలము ఒక్క రోజులో పూర్తిచెయ్యటము అలాగె కావ్యపఠనము ఆశువు ప్రక్రియలను కలిపి ఒకే అంశముగా చెయ్యటము ఓ అపూర్వమైన ఘటన.

సుమారు 80 మంది పృచ్ఛకులు (వంద మంది దొరకటము అంత సుళువైన విషయము కాదు లెండి) దత్తపది, సమస్య, వర్ణన, కావ్యపఠనము, ఆశువు అనే ఐదు అంశాలను నిర్వహించారు. ఇవే గాక హ్యూష్టన్ వాస్తవ్యుల శ్రీ వంగూరు చిట్టెన్ రాజు గారు నిర్వహించిన అప్రస్తుత ప్రసంగము, కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించినది. ఉదయము 9 నుండి సాయంత్రము 8.30 వరకు సాగిన ఈ కార్యక్రమము సభికులను, పద్యసాహితీప్రియులను, పృచ్ఛకులను ఆద్యంతము అలరించినది.

సాహితీ కార్యవర్గ సభ్యునిగా, పృచ్ఛకునిగా నాకు ఇది ఒక అపూర్వమైన అనుభవము. ఒక అసాధారణ ప్రజ్ఞావంతుని అలాగె ఒక క్లిష్టతరమైన ప్రక్రియను అతి సమీపముగ చూడటము రోజువారి జరిగే విషయము కాదు మరి. మేడసాని గారి ధారణా పటిమ, సమయస్పూర్తి దానిని మించి అతివేగముగ చక్కటి ఆశు పద్యాలను వల్లెవేయగల వారి ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచినది. టెరా టెరా బైటులు రేము ఉండే సూపరు ప్రాసెసింగ్ కంప్యూటరును గుర్తు చేసినది. ఆఖరున వచ్చే అవధాని ప్రశంసా కార్యక్రమములో ఇదే విషయాన్ని పద్య రూపములో (నేను సైతము :-) ) సభకు వినిపించాను.

ఈ శతావధానములో అవధానిగారు పూరించిన కొన్ని చక్కటి దత్తపదులు, సమస్యలు (కర్టసి భాస్కర్ రాయవరము) 


భామ, మామ , దోమ, చీమ – చిన్ని క్రిష్ణుడు యశోద దగ్గర చేసిన గారాబం గురించి
భామహనీయమై సరస బంధురమై అలరారు నట్లుగా
మామక ముక్త లీలల సముంచిత చేష్టల చూచుచున్న ఏ
దో మహితాత్మ మాత్రు మృదు దోహద లీల తలంచి నంతనే
చీమకు బ్రహ్మకున్ ప్రకృతి సేవలు చేసెడి భాగ్య మబ్బగన్

సిగ్గు, పెగ్గు, రగ్గు, ముగ్గు – మద్యపాన నిషేధం గురించి
ఎగ్గు సిగ్గు లేక ఇంపు సొంపులు లేక
పెగ్గు పట్టుచున్న పెద్దలున్న
మద్య పానగతుల మలయుదురగ్గు
ముగ్గు బాలతోడ నొప్పునేమో?

చెక్డాముల్ మన దేశమందు వికటిస్తిత మైనట్లుగా
చెక్డీల్ కోరిన వారికిన్ పటు శ్రీమంతమై ఒప్పగా
మెక్డోనాల్డ్ న ఇడ్లి వోలె అవి ఎవేమిన్ ప్రసాదించునే
మెక్డోనాల్డ్ న ఇడ్లి తింటివి గదా మీమాంస మింకేలరా!

సంగత వీర రౌద్ర విలసత్వమునన్ బలరామ కృష్ణులు
తు్తంగ బల ప్రతాప దోహద కేళి చరించు వేళలో
హంగుగ కంసు మల్లుర రయంబుల.. అట్టి.. వీ
రంగులు రంగ మధ్యమున రక్తము గార్చి హతమ్ము జేసిరా!

స్వాంత మొప్పగా ప్రశాంత ప్రభాతాన
వేడి పానమునకు వెదకుచుండ్రు
అట్టివారి కెల్ల ఆనందముగ పాల
బూతు పదము మేలు భువనమందు
-----------------------------------------------------------

ఇకపోతే కొంచెము సెల్ఫ్ డబ్బా.. పృచ్ఛకులు అవధానిని పొగడటము ఒక సంప్రదాయము.. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను చెప్పిన పద్యాలు..

అచ్చెరువొందురీతి నవధానములెన్నియొ నాల్గు మూలలన్
ముచ్చట జేసి వచ్చిరిగ; మోదము కూర్చిరి డల్లసందున
నె్మచె్చడి పద్యముల్నుడివి; మీరుచు రంజిల చేసిరీ తిథిన్;
వచ్చిన మేము ధన్యులము వాణిసుతాగ్రజ! వందనమ్మిదే 

వ్యాకరణపురాణపద్యకావ్యములందు

      సాటిలేని యపార 'డేటబేసు'

పంచశతసహస్ర ప్రశ్నలొకపరిగ
      పూరించగల 'మల్టిప్రొసెసర్రు'
అసమంజసప్రలాపాటంకముల 'ఇంట
      రెప్టు' లాపని వాహ్ భలె 'పెరిఫెరలు'
వేలసమస్యప్రహేళిక లొకసారి
      వచ్చి 'రేము'ని నింప వచ్చెరువుగ

ట్విటరు గూగులు ఇంటరునెటు నిఘంటు
ల కలదె తమబోలిన యపార పదగరిమ
కంప్యుటరు గింప్యుటరు సాటి కావు తమకు
మేటి కవి!! యవధానేశ!! మేడ సాని

క్రికెటుకు 'సచిన' బాస్కెటు కేమొ 'మిఖెలు'
'ఆలి' యెగ బాక్సు చేయగ అవని యందు
సాకరుకు 'పీలె' గోల్ఫుకు రాజు 'ఉడ్సు'
సాటి మీకేరు? అవధాన సార్వభౌమ

19, ఫిబ్రవరి 2011, శనివారం

భళిర మనజట్టు

బలిహారి చెలరేగ బలి గారె బౌలర్లు?
       భళిర 'టెండుల్కరు' బ్యాటు చుండ
వాహవ్వ బహుబాగు 'సెహవాగు' బాదుడు
       సైదోడు 'గంభీరు' 'సచిను'లుండ
'యువి కోహ్లి రాయిణా యూసఫులు' కెరల
 
       వరదలై పరుగులు పారు చుండ
'ఖాను శ్రీ సింగులు' కట్టడి చేయంగ
       సారధియై 'ధోని' సాకు చుండ

అడ్డ మెవ్వరు మనకు సౌతాఫ్రికాలు,
లంక, ఆసీలు, పిచ్చులా? వంకలేని
జట్టు విశ్వవిజేతయై జనులు మెచ్చ
వెలగ వలెనని ప్రార్థించె తెలుగుయాంకి

బలిహారి (వామనుడు), బలిని అణగదొకి్కనట్టు మన లిటిల్ మాష్టరైన సచిన్  బౌలర్లను అణగదొక్కాలి అని నా భావన. అలాగే
భారతజట్టు
క్రికెట్టులో విశ్వవిజేతగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

11, సెప్టెంబర్ 2010, శనివారం

ఉరుకు ఉరుకు.. నెమ్మది నెమ్మదిగ

అది 2004జనవరి ఒకటి. చాలా మంది మిత్రులు తమ తమ  'న్యుఇయర్ రిజల్యూష్ ను'లు, కొత్త సంవత్సరములో మళ్ళీ సరికొత్తగా చెపుతున్నారు. తీర్థము సేవించి తెల్ల గుఱ్ఱము పై  స్వారీ చేస్తున్న బుర్ర నా ప్రమేయము లేకుండానే కొత్త రిజల్యూషన్ని వెల్లడించింది.  ఉదయము నిద్ర లేచాక ఆలోచిస్తే అర్థమయినది - రాత్రి జరిగిన పొరపాటేమిటో. కానీ అప్పటికే అవ్వాల్సిన డామేజి  అయిపోయింది.  నేను 'మారథాన్ ' చేస్తానని కమిట్ అయినట్టు, నాకన్నా ఓ ఆరుగంటలు ముందే అందరికీ తెలిసిపోయింది.

అంతకు ముందు పట్టు మని పది నిమిషాలు కూడా నేనెప్పుడూ గట్టిగా పరిగెత్తిన పాపాను పోలేదు. అలాంటిది 26.2 మైళ్ళు (42.2 కి.మీ) అంటే మాటలా? దానిని ముక్కి మూలిగి,అంచెలంచెలుగా ఎలా సాధించాను(?) అనే విషయము, ముందు ముందు మరికొన్ని టపాలలో వివరిస్తాను.

అది సరే ఇంతకీ ఈ టపా విషయమేంటి అంటారా? అక్కడికే వస్తున్నాను. కొద్ది రోజుల క్రితము, నాతో పాటు పరిగెత్తడము మొదలెట్టిన టామ్ గాడి ఫేస్ బుక్ అప్ డేటు చూసాను. వాడు మారథానేమి కర్మ దాని బాబు లాంటి 'ఐరన్ మాన్ ' నికూడా పూర్తి చేసాడంట మొన్నీమధ్యనే. మరి ఇక్కడ, గత నాలుగు సంవత్సరాలలో  నేను పరిగెత్తడానికీ, జిమ్ముకీ వెళ్లిన రోజులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. దానికి తోడు కొంచెము ఎదిగే వయసు గదా మనది!!.  మాంచి టిప్ టాప్  షేపులో ఉన్నాను.

ఆ ఫేస్ బుక్  అప్డేటు నా కెక్కడో చిన్న ముల్లుతో గుచ్చినట్టనిపించినది. బూజు పట్టి భద్రముగా ఉన్న బూట్లను క్లాజెట్ లోనించి బయటకు తీసాను.  బుడిబుడి అడుగులతో మళ్లీ పరిగెత్తటము మొదలెట్టాను.  అలాగే ఈ భీషణ ప్రతిజ్ఞను కూడా చిత్తగించండి.. కింద పద్యము చదవటానికి ట్యూను కావాలంటే కృష్ణార్జున యుద్ధము సినిమాలోని కృష్ణుని ప్రతినకు సంబంధించిన ఈ ఘట్టము చూడండి.

సీ:       'మాచిఫిక్సింగు'లు  మాని సద్బుద్ధితో
               ఆడిన  'క్రికెటర్లు'  ఆడవచ్చు
          'ఫేంటసీ' ఆఖరి  'పికు్క' దండిగ నాకు
               ఇచ్చిన పాయింట్లు ఇవ్వ వచ్చు
          వైరమును విడిచి భళియన్చు 'యాంకిఫాన్ '
               తొడిగిన 'రెడ్ సాక్సు'  తొడగవచ్చు
          'ఆఫ్రిక'నేతర్లు 'మారథాన్' పరుగులో
               గెలిచిన అవలీల  గెలవ వచ్చు

తే:       బ్లాగు మిత్ర!!  మీ సాక్షిగ పలుకు చుంటి,
          ఉరికె దను క్రమశిక్షణ తోడ వళ్ళు
          వంచి  'హాఫ్ మారతాన్' మళ్లి;  ప్రతిన తప్పి
          నచొ, సదాగుర్తుచేయని తప్పుమీదె!!!

అది సంగతి. మరి మీ బాధ్యత అర్థమయ్యింది కదా!! నేను కూడా ప్రతి వారము, సాధ్యమైనంతవరకు, నా పురోగమనానికి సంబంధించిన సంగతులు తదితర విషయాలు టపాల రూపములో పంచుకుంటాను. ఇంకా ఎక్కువగా రాస్తుండాలనే సలహా నాకిచ్చిన గౌరవనీయులు అఫ్సరు గారి మాట ఈ విధముగానైనా వినట్టుంటుంది.

 నాతో పాటు మరో మిత్రుడు కూడా పరిగెత్తాలని మొదటి అడుగు వేసాడు. డల్లాస్ లోన డిసెంబరులో జరగబోయే హాఫ్ మారథాన్ లో పాల్గొనాలనేది మా గోల్.  అలాగే మీలో ఎవరైనా మాతో పాటు, ఈ వర్చువల్  ట్రైనింగు  గ్రూపులో  పాలు పంచుకోవాలంటే తెలియచెయ్యండి.  కలిసి విడివిడిగా ఉరుకుదాము.

8, జూన్ 2010, మంగళవారం

పలుగు పార - టెక్సాస్ లో రైతు బిడ్డ


ఓ నెల రోజుల క్రితమనుకుంటాను మా నార్త టెక్సాస్ లో మాంచిగా వర్షాలు పడ్డాయి. స్ప్రింగ్ వెళ్ళి సమ్మర్ వచ్చింది. ప్రతి సంవత్సరము లాగే ఈ సారి గూడా నాకు అదే తంటా వచ్చి పడింది. చెట్లన్నీ చిగురించాయి. దాంతో పాటు మా పక్కింటి వాడి 'లాను'లో గడ్డి  కూడా, కాంప్లాన్ తాగిన పిల్లాడిలా, ఏపుగా పచ్చగా పెరగటము మొదలయ్యింది. అవును మరి వాడు అదేదో ఎరువూ, లాన్ ఎమర్జెంటూ, మన్నూ మశానమూ  వేసా్తడు గదా! !. ఎప్పటి లానే నేను ఆ చిన్న పని (కూడా) చెయ్యటము మర్చి పోయాను. 

          మీ ఎదురింటోడో, పక్కింటోడో మీలాగా పని దొంగ కాకుండా ఉంటే నా బాధేంటో మీకు బాగా అర్థమయ్యేది.  దానికి తోడు, వాడు వారాంతము ఎప్పుడొస్తుందా, ఎప్పుడు తన లాను లోని గడ్డిని పట్టు తివాచి లాగా మారుద్దామా అని ఎదురు చూస్తూంటాడయె్య.   వాడికున్న "స్టేట్ఆఫ్  ది ఆర్ట్ " లాన్   మోవింగ్  పనిముట్లతో,  పడుచుపెళ్లానికి ఇసీ్త్ర  చేసిన మెత్తటి చిలకపచ్చ కోకరైకలు చుటి్టనట్లు, ప్రతి వారము  దానిని తీర్చి దిద్దుతాడు. దాని పక్కన మా లానెప్పుడూ  ' హైదరాబాదులో IT ఉద్యోగి సరసన  సెక్రటేరియట్ క్లర్క్' లాగా   వెలవెల పోతూనే ఉంటుంది.
          కొత్తగా ఇంట్లోకి మారిన రోజుల్లో నేను గూడా ఎంతో ఆవేశముతో, మోవర్లూ  ఎడ్జర్లూ లాంటి పనిముట్లు కొని  Home Depot వాడిని  ఓ మాదిరిగా బాగానే పోషించాను.   ప్రతి వారము కొత్త పెళ్లాములా, ఎంచక్కగా లానుని తీర్చిదిద్దేవాడిన.  నా మిత్రుడొకడు - "నీకంత సీను లేదు ఎందుకు వృధా శ్రమ" అని  నాకుచిలక్కి చెప్పినట్టు చెప్పినా నేను వింటేనా.  అచ్చమైన తెలుగోడినయ్యే.  నా ఆరంభశూరత్వము ఆరు నెలల తరవాత అంత మయి్యంది. Mowingపనిముట్లన్నీ గరాజిలో ఓ మూలున్న గోల్్ఫ క్లబ్బులు, డంబెల్లులు , టెన్నీసు రాకెట్ల పక్కకెళ్లి నక్కాయి.  Lawn mowing job ని ఓ హిస్పానిక్ వాడికి outsourcing చేసి, Economyకి  నా వంతు తోడ్పాటందించానన్న తృప్తి మిగుల్చుకున్నాను.  ఆ 'మొరాకో' పుణ్యమా అని మా లాను గూడా అప్పటినుంచి ప్రతి రెండు వారాలకూ, పక్కింటోడిదంత కాక పోయినా ఓ మాదిరిగా బాగానే ముస్తాబయ్యేది.
          ఇక వర్తమానానికోస్తే  - అందరూ హోమ్  డిపోలకూ నర్సరీలకూ వెళ్ళి, రకరకాల పూలూ కాయగూరల మొక్కలూ తీసుకొస్తుంటే, peer pressureవలన నేను గూడా వెళ్లవలిసి వచ్చింది. అలా వెళ్లినోడిని ఏదో శాసా్త్రనికి రెండో మూడో మొక్కలు తెస్తే సరిపోయేదా? లేదే- ఆవేశముగా ఓ డజను మిర్చి, టమోట, వంగ నారు మొక్కలు తీసుకొచ్చాను.  మా శ్రీమతి తన వంతుగా బంతి పూలూ, మందారాలూ బాగున్నాయని మరిన్ని తీసుకొచ్చింది.  వాటితో పాటు ముటా మేసి్త్ర  లాగా నేను ఐదారు ఎరువుల మూటలు గూడా మోసుకుంటూ  తెచ్చి, బాక్ యార్డులో వాటన్నిటిని చక్కగా లైనులో అమర్చాను.
          సరిగ్గా ఆ రోజునుంచి మొదలయ్యాయి నా తిప్పలు. ప్రతి రోజూ పొద్దునే లేచి, చేత్తో కాఫీ కప్పు పట్టుకుని కిటికిీ గుండా బయటకు చూస్తే అవన్నీ కనపడేవి.  ఇరుకు కుండీలలో ఉన్నా మొదటి కొన్ని రోజులు ఎంతో ఉత్సాహముతో పలకరించేవి.  ఓ వారము గడిచి పోయింది. రెండ్రోజులు మించి  తనింట్లో తిష్టేసిన అతి్తంటి చుట్టాన్ని చూసినట్టుగా చూడటము మొదలెట్టాయి నా వంక.  'ఎప్పుడు మమ్మల్ని ఈ ఇరుకు కుండీ కొంపలో నుంచి తీసి ఆరు బయట చక్కటి పాదులో పెడతావు?' అని నన్ను నిలదీసి అడగసాగాయి. వాటి బాధ పడలేక ఓ రెండు వారాలనుంచి  కిటికీ గుండా బాక్ యార్డ్ లోకి చూడటమూ వెళ్లటమూ   మానేసాను.
          ఎన్ని రోజులని తప్పించుకోగలును? కొన్ని మొక్కల వేర్లు పెరిగి పెరిగి కుండీల నుండి బయటకు పాక్కుంటూ నా వైపుకు రాసాగాయి. టమాటా మొక్కలు, పూలు పూసి కాయలు గూడా కాయటము మొదలెట్టాయి.  ఒక పచ్చి మిర్చి మొక్క తన జ్వాలా శరాలనెన్నో నామీదకు సంధించి పోరాడి ఆఖరకు  వీర స్వర్గమలంకరించింది. అందుకే ఇక ఈ ఆదివారము నాకు తోట పని చెయ్యక తప్పలేదు. 'ఏసీ' లకు  అలవాటు పడిన బాడీకి,  బయటెండ పిలానీ వేసంగిని మరిపించేట్టుగా అనిపించింది. టెక్సాస్ సైజు గ్లాసునిండా లెమనేడు తాగి రెండు మూడు వామప్పు బస్కీలు తీసి పని చెయ్యటానికి బయలుదేరాను.
          ఎంతైనా రైతు బిడ్డను గదా. దానికి తోడు ఒంట్లో ఇంకా ఎక్కడో పల్లె రక్తము ఉరకలెత్తుతూనే ఉన్నది. షార్టేసాను. చొక్కా తీసాను. తలకు తుండు చుట్టాను. పలుగూ పారా పట్టాను. తీర్ధయాత్రకు తిరుపతో లేకపోతే ప్రేమ యాత్రకు పారిస్సో ఈ సంవత్సరము వెళ్ల్లాల్సిన అవసరము అస్సలు లేదు.. ఎంచక్కగా మనము గుండమ్మ కథ లో  ఎ.ఎన్.అర్-జమున జంటలా, పక్కోడికి ఇనపడకుండా డుయట్టు పాడుకుంటూ పనిచేద్దామని,  మా శ్రీమతినితోటి తోట కూలీగా తీసుకుని బాక్ యార్డ్ కి వెళ్లాను.  ఇదేదో కూల్ గా ఉందని మా పిల్లలూ, వాళ్లెనక తోకూపుకుంటూ మా శునక 'రాజు' గూడా వచ్చాడు.
          ఇక పోతే అమెరికాలో పలుగూ పారలు,  వాటితో నా అనుభవము గురించీ  ఇక్కడ ఓ మూడు ముక్కలు చెప్పాలి. అమెరికాకు రాక ముందు నాకు తెలిసినంతవరకూ ఏదన్నా తవ్వాలంటే గడ్డ పలుగొక్కటే సాధనము. గడ్డ పలుగనేది మునుగఱ్ఱంత పొడవుండి ఇనుముతో చెయ్యబడి మొదలూ చివరా తొవ్వటానికి తగ్గట్టుగా ఉంటుందనీ,  అలాగే తవ్విన మట్టిని తియా్యలన్నా  మిరపచేలో కాలవకు మడవ వేయాలన్నా పారను మించిన పనిముట్టు మరోటి  లేదనీ గుర్తు. సొంతముగా నాటి అందరి దగ్గిర కె్రడిట్ కొట్టెయ్యాలనే ఆలోచనతో ఇంటికొచ్చిన కొత్తలో రెండు మూడు పెద్ద చెట్లు నర్సరీ నుండి తీసుకొచ్చాను.  తీరా హోమ్ డిపోకి వెళ్లి ఎంత వెతికినా నాకు తెలిసిన పలుగుపారలు కనపడితేనా. ఆక్కడ పనిచేసేవాడిని పిలిచి, నాకు తెలిసిన రకరకాల ఇంగ్లీషు పేరులతో, కావలసిన వాటి గురించి వాకబు చేసాను. ఏమీ ప్రయోజనము కలగలేదు. చివరికి ఆంగికము వాచకములతో కూడిన నా  ఏకపాత్రాభినయము పుణ్యమా అని వాడు గడ్డ పలుగ లాంటి పలుగూ, నుంచుని తవ్వే పార (Spade) తెచ్చిచ్చాడు.  వంగకుండా వాడే ఈ కొత్త రకము పార  సుళువేమిటో నాకు ముందు ముందు బొజ్జ పెరిగేకొద్దీ మరింత  బాగా బోధపడింది .
          వాటిని పుచ్చుకుని రెట్టించిన ఉత్సాహముతో ఇంటికొచ్చి పని మొదలెట్టా. అందరిలా ముందుగా తవ్వటానికి  అమెరికా పారను వాడాను. ఎంత కష్టపడ్డా గుంట బెత్తెడు లోతును మించి పెరగలా. ఇలా కాదని గడ్డ పలుగు బయటకు తీసా. ఏదో సినిమాలో కృష్ణంరాజులాగా, బ్యాక్ గ్రౌండ్లో "ఆడుతు పాడుతు పనిచేసు్తంటే అలుపు సొలుపేమున్నది"  పాట మ్యూజిక్ వస్తూండగా, పలుగుతో ఓ పోటు పొడిచాను. గుంట లోతు కొంచెము గూడా పెరగలా.  మరో సారి ఆతరవాత ఇంకో సారి ప్రయత్నించా. పెద్దగా తేడాలేదు. ఈ సారి వెనకనుంచి ఎవరో కిసుక్కున నవి్వనట్టుగా అనిపించింది. నిజముగానే నవ్వారనుకుంట. నాకు ఎక్కడ లేని పౌరుషము ముంచుకొచ్చింది. దానితో పాటు రెట్టించిన బలము కూడా. 'జై భజరంగ భలి' అని మనసులో గట్టిగా అనుకొని బలమంతా కూడగట్టుకొని  గునపాని్న గట్టిగా కిందకు దింపాను. ముందుగా తళుక్కు మని మెరుపు. ఆ తరువాత చిన్న ఉరుము. వెనువెంట ఉప్పెనలా పాతాళ గంగ వెల్లుబుకింది. ఎక్కడ చూసినా నీళ్ళు.  అంతా జలమయము. రెండు నిమిషాల తరవాత అర్థమయి్యంది నేను చేసిన ఎదవ పని. గడ్డ పలుగుల తాకిడి తట్టుకునే సత్తా భూమిలో ని pvc పైపులకు ఉండదని బాగా తెలిసొచ్చింది.  ఆ దెబ్బకి గెడ్డ పలుగు వాలంటరీ రిటైర్మెంటు పుచ్చుకుని గరాజిలోకి సుదీర్ఘ విశ్రాంతి నిమిత్తము వెళ్లింది.
          సరిగ్గా ఇన్ని రోజులకు మళ్లీ బయటకు వచ్చింది, తన సహచరుడైన అమెరికా పారతో.  న్యు ఇయర్ రిజల్యూషన్ తో కొత్తగా జిమ్ము కెళ్లే వాడి లాగా, ఉత్సాహంతో మాంచి ఎండలో తవ్వటము మొదలెట్టా.   రెండు మూడు పాదులు చేసి, టాప్ సాయిలూ ఎరువూ కలిపి టమాటా మొక్కలు నాటా.  నా పని తనాన్ని చూసి నాకు నేనే ఎంతో ముచ్చట పడ్డా. ఆ మొక్కలు గూడా ఆనందముగా తలలూపినట్టగా కనిపించాయి.  ఆనందముతో మరిన్ని పాదులకు  మట్టిని తవ్వాను.
          ఎంత రైతు రక్తము ఉరకలేస్తున్నా, పదిహెనేళ్ల నుంచి మద్యమాంసాలతో  ప్రేమగా  పెంచి పోషించిన కండరాలమీది మెత్తని పొర,  అడుగడుగునా నా పనికి అడ్డుతగుల్తూనే  ఉన్నది. ప్రతి రెండు నిమిషాలకు బ్రేకులు (break – a new word in my vocabulary courtesy my daughter) తీసుకోమంది. మా అమ్మాయి పర్యవేక్షణలో ఈ తోట పని రెండు గంటలు సాగింది. ఎంచక్కగా తను మాత్రము, నీడలోని కుర్చీలో కూర్చుని పాదులు ఎలా తవ్వాలి, మట్టిన ఎలా పడెయ్యాలి అనే విషయాలు కూలంకషముగా నాకు వివరించింది.  నా బాసు ఏ  'Peter  or Paul ' ఎందుకో,  విషయజ్ఞానమంత లేకపోయినా  వాళ్లు నాతో పనులెలా చేయించగలుగుతారో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది.  ఈ గాలీ నీరూ పుణ్యమా అని ఆ లక్షణాలు చిన్నప్పటినుంచే వచ్చేస్తాయనుకుంట!!
          పాదులు చేసి,  మొక్కలన్నీ నాటేటప్పటికి నా తల ప్రాణము తోకకొచ్చింది. వొంట్లో పులుసంతా చెమట రూపములో బయటకొచ్చెయ్యటము మూలాన షుమారు నాలుగైదు పౌండ్లైనా తగ్గుంటాను. 'నానా ఎందుకింత శ్రమ? ఎన్ని ఎల్బీలు కాయబొయుతున్నాయి? We can buy  all this stuff in Kroger at a very  very low price"  అని తేలికగా తేల్చి పారేసింది మా అమ్మాయి. అది!!! నా ఘర్మ జలానికి పెట్టుబడిదారైన షరాబు కట్టిన వెల. నే చేసిన శ్రమకు ప్రతిఫలమింతేనా అని అలిసిన నా వళ్లు ఆక్రోశించినది.  నవ్వుతూ నా వంకకు చూస్తున్న వంగ చెట్లు మాత్రము, "మమ్మల్ని సాకి మరో జన్మనందించిన నీకు మేమేమివ్వగలము" అని వవ్వుతూ పలికినట్లనిపించింది. నా అలసటంతా మటుమాయ మయి్యంది. చూద్దాము రేపు నా బాడి పరిస్తితి ఎలా ఉంటుందో,  ఈ మొక్కలెలా ఉంటాయో!!

27, మార్చి 2010, శనివారం

తిరుపతి వెంకట కవులు

ఈ రోజు 'నెలనెలా తెలుగు వెన్నెల' కార్యక్రమానికి విచే్చసిన సాహితీ మిత్రులందరకూ నా హృదయ పూర్వక నమస్కారములు. 'మాసానికో మహనీయుడు' శీర్షికన, ఆయానెలలలో వర్ధంతిగానీ జయంతి గానీ జరుపుకున్న తెలుగు మహానుభావులలో ఒకరిని ఎంచుకొని వారి గురించి సోదాహరణముగా సభికులకు వివరించడము జరుగుతుందన్న విషయము మీకు తెలుసు. ఆ నవయుగ వైతాళికులను సంస్మరించుతూ, వారు తెలుగు భాషకూ, సంస్కృతికీ ఏ విధముగా వన్నె తెచ్చారు అని చరి్చంచుకోవటము ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ మార్చినెలలో కూడా ఎందరో తెలుగు మహనీయుల గూర్చి మనము చెప్పుకోవచ్చు.

తెలుగింటి ఆడ బడుచు 'కాంతం' పాత్రను సృష్టించిన మునిమాణిక్యం నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవచ్చు. అభినవ తిక్కన, తెలుగు లెంక తుమ్మల సీతారామూ్మరి్త చౌదరి గారి గురించి చెప్పుకో వచ్చు.

"ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు, తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల.”

అంటూ ఎంకిని తెలుగు వారికి పరిచయము చేసిన నండూరి సుబ్బారావు గారి గురించి చెప్పుకోవచ్చు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

అంటూ దేశభకి్తని తెలుగు వారికి ప్రబోధించిన నవ్యకవితా పితామహుడూ, భావకవులలో ఆద్యుడూ అయిన రాయప్రోలు సుబ్బారావుగారి గురించి మాట్లాడుకోవచ్చు. వీరందరికీ వినమ్రతతో నమస్కరించి, ఇవాళ వీరికి బదులు మరో తెలుగు తేజము గురించి చర్చించుకుందాము.

అది 1977 జనవరి. సంక్రాంతి సందర్భముగ, మహాభారతము ఇతివృత్తముగా గల రెండు తెలుగు చలన చిత్రాలు దాదపు ఒకే సారి పోటా పోటీగా విడుదలయ్యాయి. మొదటి దానిలో తెలుగు చలనచిత్ర ప్రపంచములోని మహొ మహులనదగ్గ వాళ్లందరూ ఉన్నారు... ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ తప్ప. దర్శకుడు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామెశ్వరావు గారు. మంచి మాటలు, పాటలు, చాయాగ్రహణం, కథనం. రెండో దానిలో ఇవన్నీ కొంచెము తక్కువ పాలే. అయినా గూడా 'కురుక్షేత్రం' కన్నా 'దానవీరశూరకర్ణ' సినిమా, ప్రజల హృదయాలలో ఎక్కువ చోటు సంపాదించుకుంది. ఎందువలన?

నటసార్వభౌముని అద్భుతమైన త్రిపాత్రాభినయము వలన గావచ్చు. అలాగే కొండవీటి వెంకట కవి రాసిన సరస చతుర గంభీర సంభాషణలు వలన గావచ్చు. కానీ నా ఉద్దేశ్యములో మాత్రము ముఖ్య కారణము - మరో ఇద్దరు. వారికి వినమ్రతతో నా ఈ ఉత్పలమాలను సమర్పిస్తున్నాను.

ధాటిగ కైతలల్లిరవధానములన్నిట, ఆంధ్రసాహితీ
వాటికి శోభ నీయు బిగి పద్యము హృద్యము గన్ రచించి రా
నాటకరంగ పద్యముల నాటికి నేటికి లేరు వీరికిన్
సాటి; జగత్ప్రసిద్దులగు జంటకవీంద్రుల కంజలించెదన్


వారెవరో మీరు ఊహించే ఉంటారు ఈ పాటికి. తిరుపతి వెంకటకవులు. దివాకర్ల తిరుపతి శాస్తి్ర లో తిరుపతి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి లో వెంకట కలిపి 'తిరుపతి వెంకటకవులు' అని ప్రసిద్ది పొందారు. నిజానిక మనము ఈ మార్చినెలలో తిరుపతి శాస్తి్ర గారి గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టిన రోజు, క్రీ.శ. 1872 మార్చి 22న. కానీ ఆయన ఒక్కరి గురించే మాట్లాడటము ఆ జంట కవులకు అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు సాధించినవన్నీ జంటగానే చేసారు కాబట్టి.

అదిగో ద్వారక! ఆలమందలవిగో! అందందు గోరాడు, అ
య్యదియే కోట, అదే అగడ్త; అవె రథ్యల్ వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడఅదిగో; నాలానదంతావళా
భ్యుదయంబై వరమందురాంతర తురంగోచ్చండమై పర్వెడున్

ఈ పద్యాన్ని మీరు వినే ఉంటారు. లేకపోతే ఘంటసాలగారి గొంతులో ఇక్కడ వినవచ్చు. ఇది అర్జునుడు, కృష్ణుని సహాయార్ధము వెడుతూ, ద్వారకాపురి దగ్గరలోకి వచ్చాక చెప్పే పద్యము. ఆ జంట కవులు గనుక ఇవాళ, 'లుయిస్ విల్ 'లోని ఈ 'కోకిల' రెస్టారెంటుకు వచ్చి ఉంటే, ఆ మతే్తభముమీద అమెరికా అంబారీ పరిచి ఈ విధముగా చెప్పేవారేమో!!

అదిగో కోకిల ! వాపొకోడిలవిగో! కమ్మంగ నోరూరు న
య్యదియే హోటలు 'లూస్విల'ందు రుచిగన్, ఆహ్వానితుల్ ఎల్లరు
న్మదికావ్యోల్లస మందు చోటు నదిగో; 'మార్చెనెనుట్టీవి' ఇ
య్యదియే భాసిలు కైతపద్యములతో; ఆహూతి సుస్వాగతం

తిరుపతి శాస్తి్రగారు పశ్చిమ గోదావరి జిలా్ల, భీమవరం దగ్గరున్న యండగండి అనే గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి గారైన దివాకర్ల వెంకటావధాని గారు కూడా గొప్ప పండితుడు. ఆయనచే రచింపబడిన కావ్యలహరి అనే వ్యాసాలు సంకలనము చాలా పేరగడించినది.

చదువుకునే రోజులలోనే తిరుపతి శాస్రి్తగారికి వెంకట శాస్ర్ర్ర్తిగారితో పరిచయము కలిగింది. వారు కలిసి అవధానాలు, రచనలు చేయటము మొదలు పెట్టారు. విశ్వనాధ సత్యనారాయణగారి లాగ తిరుపతి శాస్రి్తగారు కూడా సదా వెంకట శాస్తి్రగారిని తన గురువుగానే భావించేవారు. క్రీ.శ. 1920లో తిరుపతి శాస్రి్తగారు చనిపొయాక వెంకటశాస్తి్ర గారు, వారి స్వీయ రచనలను జంట రచనలుగానే ప్రచురించారంటే వారిద్దరి మధ్యన ఉన్న సంబంధము ఎంత గాఢమైనదో అర్థము చేసుకోవచ్చు.

తిరుపతి శాస్రి్తగారి వాదనా పటిమ అసాధారణమైనది. వెంకటశాస్త్రిగారు పురాణ సాహిత్యలలో ఉపన్యాసలు ఇవ్వటములోనూ, ఆశువుగా కవితలల్లటములోనూ దిట్ట. అందుకే వారిద్దరి జోడీ అంత చక్కగా కుదిరింది.

ఇకపోతే వారి రచనల విషయానికి వస్తే బాగా ప్రాచుర్యము పొందినవి 'పాండవ ఉద్యోగవిజయములు'. ఇవి పాండవుల జననము నుండి, విజయము వరకు ఉన్న ఆరు రచనల సముదాయము. వీటిలో గూడా పాండవ ఉద్యోగము మరింత ప్రసిద్ధమైనది. వీటిలోని కొన్ని పద్యపాదాలైనా తెలియని (ఈ జెనరేషను వారు కాదులెండి) తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు అలాంటి కొన్ని ఆణిముత్యాలను గుర్తు తెచ్చుకుందాము..

ఎక్కడనుండి రాక ఇట? కెల్లరున్ సుఖులేగదా? యశో
భాక్కులు నీదుయన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
చక్కగ నున్న వారె? భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి దాను చరించునె తెల్పు మర్జునా!

అని ముందొచ్చిన దుర్యోధనుడిని గాకుండా తదుపరి వచ్చిన అరు్జనుని చూసి చెప్పే పద్యమిది. పాండవులందరి గురించి, ముఖ్యముగా భీముని గురించి ఒక్క పద్యములోనే యోగక్షేమాలు ఎలా అడిగాడో గమనించండి. తరువాత దుర్యోధనుడిని చూసాడు.మరో అజరామరమైన పద్యాన్ని అందుకున్నాడు.

బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీవాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతికోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

Hey Dude! how are you? అనో, లేక Hey Sam! Whats up? అనో అడిగాడా, లేదు. ఎంత చక్కగా 'ఏరా బావా ఎప్పుడు వచ్చావు'.. అని అడిగితే 'మీ అక్కయ్యను బస్సెక్కించి ఇప్పుడే వచ్చానురా' అని ఎంత చక్కగా సమాధానము చెప్పవచ్చు? అదీ!! మన తెలుగు సంస్కృతంటే. బావా, మామా, అత్తా అని నోరారా పలుకుతాము. అంతే గానీ కజిన్ అనో లేకపోతే అంకులనో ఇంక మరీ అధ్వానముగా క్రిష్ అనో మామను పేరు పెట్టి పిలుస్తామా? మంచినీళ్లు ఇస్తాము. అందరి యోగక్షేమాలనూ కనుక్కుంటాము. పద్యాలలో ఇవన్నీ ప్రతిబింబించేవి కాబట్టే ఇవి అంత జనాదరణ పొందాయి. వీరి భాష సరళముగా సామాన్య పల్లెప్రజలకు గూడా అర్ధమయ్యేట్టుగా ఉండేది.

ఇంకో విషయము.. నాకు గురు్తండగా, మొదటిసారి ఈ పద్యాని్న మా ఊరులో ఎవరో నాటకము వేస్తుంటే విన్నాను. కృష్ణ పాత్రదారి పేరు సుబ్బారావు అనుకుంట. ఈయన ఎన్.టి.అర్ లాగా అందగాడూ గాదూ అలాగే ఘంటసాల గారి లాంటి గొంతూ లేదు. కానీ నాకు మాత్రము ఆయన పాడిన పద్యమే మరింత బాగున్నట్టు అనిపించేది, చాలా రోజులు. అది!! ఆ పద్యము యొక్క గొప్పతనము. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పద్యము నేను పాడినా బాగానే ఉంటుంది (నాకంత సీను లేదంటారా?). అదీ!!, ప్రజలకు చేరువగా ఉండే కవిత్వము. కష్టపడి అర్ధము చేసుకోవలిసిన ప్రబంధ కవిత్వానికీ దీనికీ గల వ్యత్యాసము చూడండి? వైభవము, సమకాలీనత కోల్పోతున్న పద్య సాహిత్యాని్న ఈ నాటక మాధ్యమము ద్వారా పునరజ్జీవింపజేసి సామాన్య ప్రజల దగ్గరకు దానిని తీసుకెళి్ళన మహానుభావులు ఈ కవిద్వయము.

చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందఱుం
తొల్లి గతించె, నేడు నను దూతగ పంపిరి సంధిసేయనీ
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో
యెల్లి రణంబు కూర్చెదవొ యేర్పడ చెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్

జెండాపై కపిరాజు ముందు సిత వాజశ్రేణియుం కూర్చి నే
దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పు డొ
క్కండు న్నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్

వీటిని ఇక్కడ వినవచ్చు..


ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒకటి తరువాత ఒకటి ఆణిముత్యమే. ఉద్యోగ విజయాలే గాకుండా మరెన్నో తెలుగూ, సంస్కృత రచనలూ, అనువాదాలూ చేసారు. అవధాన ప్రక్రియలెన్నో చేసి ఆ కళను రాజాస్ధానములనుంచి జనబాహుళ్యములోకి తీసుకొచ్చారు.
సహజంగానే మహా కళాకారులకుండే స్వాభిమానము, అంటే ఒక రకమైన ఇగో వీరికి గూడా ఉండేదేమో? ఒక సారెవరో "పద్యాలు చెప్పుకునే మీకు మీసాలెందుకు?" అని అవహేళనముగా అడిగితే వారు ఈ విధముగా సమాధానము చెప్పారంట

దోసమటంచు ఎరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసలు తీసి మీ పద సమీపమునం దలలుంచి మ్రొక్కమే

అలాగే వీరు చతుర సంభాషకులుగూడాను. ఒకసారి ఓ అవధాన సభలో అప్రస్తుతప్రసంగి " అవధాని గారూ! చీకట్లో అరసున్న ఉంటుందా? " అని అడిగాడట. గ్రాంథిక తెలుగులో ఏ పదంలో అరసున్న ఉంటుందో, ఎందులో ఉండదో చెప్పటము ఎలాగో నాకైతే తెలియదు. మరి వారికి తెలుసో లేదో. "చీకటి కదండీ, అరసున్న ఉందో లేదో కనబడటం లేదు! " అని ఎంతో చమత్కారముగా తప్పించుకున్నారంట.

ఇలా చెప్పుకుంటూ పోతే వారి గురించి మరెన్నో సంగతులు. కానీ సమయము చాలదు. టూకీగా.. సాహిత్యమనేది ప్రజాదరణ పొందాలంటే ఎలా రాయాలి, సమకాలీన విషయాల మీద ఏ విధముగా శ్రద్ద చూపించాలి అనే విషయాలు వీరికి బాగా తెలియటము వలననే అంత ప్రసిద్ధినొందగలిగారు. ఆ విధముగా వీరు ప్రజా కవిత్వము రాయటానికో BluePrint మనకందించారు.

16, మార్చి 2010, మంగళవారం

వికృతి నామ సంవత్సరాది శుభాకాంక్షలు

పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు నేక దంతునకు, కోరిన కోర్కెలు దీర్చు దైవమా
కలియుగ వేల్పు వెంకనకు, గౌరికి, శూలికి, వాణికిన్, గృతాం
జలినయి, శాంతి సౌఖ్యములొసంగుమటంచుచు భ క్తి వేడెదన్